Saturday, April 5, 2014

కొన్ని జోకులు........



.........చాలామందికి తెలియవు 

మా బ్యాంకుల్లో, సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు వుంటాయి. వాటివల్ల యెంత ప్రయోజనం అనేది ప్రక్కన పెడితే, ఒక్కో వుద్యోగికీ యెన్నిసార్లు శిక్షణ ఇచ్చారు, దానికి యెంత ఖర్చు పెట్టారు లాంటి వాటికి యేవో నిబంధనలు వుంటాయి. పైగా యాజమాన్యం గొప్పగా చెప్పుకోవచ్చు".....గత సంవత్సరంలో ఇంతమందికి, ఇంత ఖర్చు చేసి, మానవ వనరుల వృధ్ధికోసం, నైపుణ్యాల వృధ్ధికీ, కెరీర్ వృధ్ధికీ, పెర్సనాలిటీ వృధ్ధికీ శిక్షణ ఇచ్చాం" అని.

అలాంటి శిక్షణకార్యక్రమాల్లో బ్యాంకు నియమించిన శిక్షకులే కాకుండా, బయటి బ్యాంకులనుంచి, ఇతర శిక్షణా సంస్థ్హలనుంచీ ప్రవీణులని, నిపుణులని, రప్పించి, ఉపన్యాసాలిప్పిస్తారు. 

సామాన్యంగా......శిక్షణ పొందేవారు ఇలాంటి వాళ్లని పెద్దగా లెఖ్ఖ చేయరు. 'ఆఁ యేం చెప్తాడులే' అనుకుంటూ. 

కానీ వాళ్లు నిజంగా వాళ్ల రంగాల్లో నిపుణులే......ఇట్టే కట్టిపడేస్తారు వినేవాళ్లని. ఇంక నవ్వులు, పువ్వులతో సమయమే తెలీదు, తెలియకుండానే చాలా నేర్చుకుంటారు శిక్షితులు!

(వుపోధ్ఘాతం కొంచెం యెక్కువయ్యింది...క్షంతవ్యుణ్ణి. ఇందులో యేమి కామెడీ వుంది అనెయ్యద్దప్పుడే).

అలాంటి ఓ తరగతిలో, ఒకాయన 'మీరు యేదైనా ఒక విషయం అనుకోండి, దాన్ని సాధించగలను అనుకోండి, ప్రయత్నించండి, తప్పకుండా సాధించగలరు' అనే విషయాన్ని నొక్కి వక్కాణించడానికి ఇలా చెప్పారు. 

ఓ పాఠశాల తరగతిలో, 'మీరు పెద్దయ్యాక యేమి చేయాలి/సాధించాలి అనుకుంటున్నారో "I think I can..........! (And Sure,) I can..........." అనే మాటలతో చెప్పండి' అని అడిగారు టీచర్. అక్కణ్నుంచీ అందరూ, నేదు దేశానికి ప్రథానమంత్రిని అవుతాను, నేను ఐ యే యస్/ఐ పీ యస్ అవుతాను, నేను పైలట్ అవుతాను, నేను అంతరిక్ష యాత్రికుణ్ని అవుతను.......ఇలా చెపుతున్నారు. 

తరువాత ఓ అమ్మాయి, 'నేను మంచి గృహిణిని అవుతాను, ముత్యాల్లాంటి పిల్లలకి తల్లిని అవుతాను'. అని చెప్పిందిట. ఆ తరువాతి అబ్బాయి, "నేను ఆ అమ్మాయికి తన లక్ష్యం నెరవేరడానికి శాయశక్తులా కృషి చేస్తాను". అన్నాడట!

అలాగే, ఇంకొకాయన యెంత ప్రతికూల పరిస్థితులనైనా, అనుకూలంగా మార్చుకోవచ్చు అని చెపుతూ...... 

కురుక్షేత్ర యుధ్ధం అయిపోయింది, కౌరవులందరూ హతులయ్యారు. అశ్వథ్థామ కోపం పట్టలేక, బ్రహ్మాస్త్రం ధరించి, పాండవులని వెతుక్కుంటూ బయల్దేరాడు. శ్రీకృష్ణుడు ఈ విషయం పసిగట్టాడు. వెంటనే దూర్వాస మహర్షిని సాయం కోరాడు. ఆయన 'నువ్వు చెపితే యేమైనా చేస్తాను కానీ, అబధ్ధం మాత్రం చెప్పను' అన్నాట్ట. "సరే స్వామీ, నిజం మాత్రమే చెప్పండి" అని ఒప్పుకొని, పాండవులందర్నీ భూమిలో ఓ తొట్టె నిర్మించి, అందులో దాక్కోబెట్టి, పైన మూత వేయించి, దుర్వాసుణ్ణి దాని మీద కూర్చో పెట్టాడట. 

అసలే యెండకి మండుతున్నా, కృష్ణుడికిచ్చిన మాట కోసం ఆయన ఓపిగ్గా కూర్చున్నాడట. అప్పుడు వచ్చి, అశ్వథ్థామ "మహామునివర్యా, పాండవుల జాడ యేమైనా తెలుసా" అని అడిగాడట. ఇంకేముందీ.....పళ్లు పటపటా నూరుతూ, "పాండవులా? నా ముడ్డి క్రింద వున్నారు చూస్కో!" అనేశాడట. పాపం అశ్వథ్థామ, ఇంకేం మాట్లాడితే యేం శపిస్తాడో ఈయన అని భయపడి వెళ్లిపోయాడట. అలా బ్రతికి బయట పడ్డారు పాండవులు......కృష్ణుడు చేసిన మాయోపాయం వల్ల!

ఇవాళే సాయంత్రం మా స్నేహితుడొకాయన మాటల్లో, "నిజంగా ఇవాళ తెలంగాణా వచ్చిందంటే, దానికి మన బొర్రముక్కోడి వాగ్ధాటే కారణం" అన్నాడు. మిగిలినవాళ్లందరూ, "పోదురూ....వాడికి వాగ్దాటి యెక్కడ యేడిచిందీ....పీల గొంతుతోనే పీకలు కోస్తాం, నాలికలు చీరేస్తాం, బొంద పెడతాం....అంటుంటే కామెడీగా వుండేది" అని తీసిపడేశారు. ఆయనన్నాడూ, "తెలంగాణా ఇస్తానంటే, బొంతపురుగుని కూడా ముద్దాడతానూ అన్నాడు. అవునా? అదే, 'తెలంగాణా ఇస్తే, బొంతపురుగుతోనైనా కాపురం చేస్తా!' అని వుంటే......ఈపాటికి సోనియా ఇటలీకి పారిపోయి వుండేది కాదా?" అని. 

హేపీ న్యూ తెలంగాణా అండ్ అవక్షేప ఆంధ్రప్రదేశ్! 

2 comments:

TVS SASTRY said...

వాస్తవాల లాగా వుండే జోకులు 'ముడ్డి కింద' పాండవులను కాపాడినట్లు కాపాడుతాయి!అయినా!పాండవులకు మాత్రం మిగిలి చచ్చింది ఏముంది?వారి సంపాదన అంతా కౌరవుల తద్దినాలకే సరిపోయిందట!

A K Sastry said...

శాస్త్రిగారూ!

భలే బాగా చెప్పారు.ఇప్పుడు కోర్టులో కేసు ఓడిపొయిన వాడు కోర్టులో యేడిస్తే, నెగ్గినవాడు ఇంటికెళ్లి యేడిచినట్లు....అనే సామెత అక్కడే పుట్టినట్టుంది.