Saturday, February 11, 2012

మనతెలుగులో........



.........నాక్కొన్ని సందేహాలు

తినికూచుంటే అనేక సందేహాలొస్తాయంటారు. తినకుండా కూర్చుంటే రావా అని సందేహించకండి.

ఒకాయన తనింట్లో రోజూ నిలబడే భోజనం చెయ్యడం చూసి, ఇంకొకాయన అడిగాడట.....అలా యెందుకు? అని. "కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయంటారుకదా? మరి నా కొండంత ఆస్తి తరిగిపోతే, రేపేమి తినాలి?" అనడిగాడట ఆయన.

"దేవుడు గ్రుడ్డివాడు" అన్నాట్టొకాయన. యెలా నిరూపించగలవు? అని అడిగితే, "గాడ్ ఈజ్ లవ్; లవ్ ఈజ్ బ్లైండ్ కదా? ఇవన్నీ వొకటే కాబట్టి, గాడ్ ఈజ్ బ్లైండ్ కాదా?" అన్నాట్ట. 

మనకి వున్న శాస్త్రాల్లో తర్క, మీమాంస లాంటి శాస్త్రాలున్నాయి. ఇలాంటి లాజిక్కులనే "తర్క శాస్త్రం" అంటారుట.

మనకి అలాంటి శాస్త్రాల్లో యేవిధమైన ప్రావీణ్యం లేకపోయినా, తరచూ మనం ఇలాంటి లాజిక్కులు మాట్లాడుతూనే వుంటాము.

అసలు విజ్ఞానానికి మూలం సందేహమే అంటారు.

మన కథలేవైనా, "మున్ను నైమిశారణ్యమున సూతుడు శౌనకాది మహా మునులకు....." అని మొదలవుతాయి.

మరి "నైమిశుడు" అనేవాడి పేరుమీద ఆ అరణ్యం యేర్పడిందా?
సూతుడు ఓ మహర్షా?
శౌనకాదుడు ఇంకో మహామునా?
బ్రహ్మాదులు అంటే, "బ్రహ్మాదుడు" అనే ఓ దేవుడుండేవాడా?

అప్పుడే ఇదేం పిచ్చి? అనెయ్యకండి.

మరి "పిప్పలాదుడు" అనే ఋషి వుండేవాడా? వుంటే ఆయన పుట్టు పూర్వోత్తరాలేమిటి?

"ధన్వంతరి" అనే ఆయన మన చరిత్రలో, చంద్రగుప్త విక్రమాదిత్యుడి ఆస్థాన వైద్యుడు. మరి ఆయన దేవతల వైద్యుడు యెప్పుడు అయ్యాడు? మొన్నటి ధన త్రయోదశికీ, ధన్వంతరికీ యెందుకు లింకు పెట్టారు? (ఆయన బంగారం చేసేవాడు, దాన్ని భస్మం చేసి, ఔషధాల్లోవాడేవాడు, అందుకనే ఆ రోజు కొంచెమైనా బంగారం "కొనాలి" అని ఒకాయన వ్రాశాడు అనీ, ఇంకా నయం దాన్ని భస్మం చేసెయ్యాలనలేదు అనీ నా ఇంకో బ్లాగులో ఓ టపాలో వ్రాశాను).

"......ఆ సుందోపసుందులు ఇంకా రాలేదా అని అడిగారు!"
"సుందోపసుందులా! వాళ్లెవరు?"
"ఇంకెవరు? సుందోపులు మీరు, సుందులు వారు!"

ఈ సంభాషణ మన ఓ సినీ కళాఖండం లోది. (గుర్తుకొస్తే నవ్వుకోండి!)

సుందోపుడు, సుందుడు అని వుండేవారా? వాళ్ల చరిత్ర యేమిటి? వాళ్లు దేనికి ప్రఖ్యాతులు? ఇక్కడ సందర్భానికి వాళ్ల పేర్లు సరిపోతాయా? ఆ సంభాషణ రచయిత, తదితర సంబంధితులు యెవరు? (ఇదేమీ క్విజ్ పోటీ కాదండోయ్! కాస్త రిఫ్రెష్ అవుతారని!)

రేపటినుంచి ఇలాంటివన్నీ "నిజాలుగా" చెల్లుబాటు అయిపోవని నమ్మకమేమిటి?

"విఖన/విఖనో" మునీంద్రుడూ, ధన్వంతరి ఆలయం, వాల్మీకి గుడీ వగైరాల గురించి వినలేదా?

మా వూళ్లో రోడ్డు ప్రక్క చెట్లకిందా, సెంటర్లలోనూ "వెలిపిస్తున్న" విగ్రహాలనీ, శిథిలమైపోతున్న గుడులని పునరుధ్ధరిస్తూ, అక్కడి ఋషుల వగైరాలని రోడ్డు ప్రక్కన పడేస్తే వాటినీ మునిసిపాలిటీ సిబ్బంది వలందరువారి రేవుకి తరలించి, ఓ చెట్టు చుట్టూ పేర్చడం మొదలెట్టారు. ఇప్పుడు, గోదావరిలో స్నానం చేసిన "భక్తులు" ఆ విగ్రహాలకి కూడా పసుపూ, కుంకుమా మెత్తేసి, అగరత్తులు వెలిగించి, అరటిపళ్లు కూడా మెత్తేస్తున్నారు. విగ్రహాలు యెక్కడ యే స్థితిలో వున్నా పూజనీయమేనంటారా? నేను కాదనడం లేదుకదా?

"ఘనంగా" ప్రతీనదికీ, కాలవకీ పూజలు నిర్వహించి, అరటిదొప్పల్లో దీపాలు వెలిగించి వాటిలో వదిలేసీ, "పోలిస్వర్గం" ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం చేస్తున్న రోజులివి! ఇంకా బోళ్లన్ని ఉత్సవాలు రావాలి--సర్వేజనా సుఖినోభవంతు అవ్వాలి మరి.

No comments: