Saturday, August 22, 2009

కరవు చర్చ

కరవా మజాకా
‘బావా! నీ కొలువుకూటము రాను రాను రణరంగ మగుచున్నదేమయ్యా?’ అంటూ ప్రవేశించాడు—మా ‘తక్కెళ్ళ రెడ్డి’--నిన్నటి అసెంబ్లీలో కన్నా వేడి వేడి గా జరుగుతున్న మన ‘రాష్ట్రం లో కరువు’ గురించి మా 'సోల్ ' లో జరుగుతున్న చర్చలోకి!
అన్నట్టు మా కుమ్మరదాసుడికి బదిలీ అయిపోయి, ఈ ‘టీ’ ఇంటిపేరుగల ‘అదేదో’ రెడ్డి బ్రాంచి మేనేజరుగా వచ్చాడు. ఆయనకి మేము పెట్టుకున్న ముద్దు పేరు ‘తక్కెళ్ళ రెడ్డి!’ ఆయనకి సందర్భానుసారం ‘కురుక్షేత్రం’ నాటకం లోని పద్యాలు వాడుకోవడం ఓ సరదా.
వాళ్ళ వూరు తక్కెళ్ళపాడు కాకపోయినా, ‘చాలా బ్యాలెన్సుడు గా వుంటాడు’ అని ఇష్టపడేవాళ్ళూ, ‘తక్కెడలా కాసేపొకవైపూ, ఇంకాసేపు ఇంకొకవైపూ వుంటాడు’ అని ఇష్టపడనివాళ్ళూ అంటారు.
‘అదికాదు బావా! నీదేమైనా నాలుకా—తాటి పట్టా? ఓ పక్క మీనం తరవాత మేషమా, మేషం తరవాత మీనమా, అదెన్నోది, ఇదెన్నోది అని లెక్ఖెట్టుకుంటావా! మరో పక్క వెకిలి నవ్వు నవ్వుతూ మీరు ప్రజలని భయపెట్టకండి—మేము కమిటీలు వేశాము, సరియైన సమయం లో కరువుని ప్రకటిస్తాము—అసలు ప్రకటించినా, ప్రకటించకపోయినా తేడా యేమీ లేదు—అంటావా?’—అనరిచాడు—మా సుందరయ్య.
‘నేనా?’ అని దీనం గా మా తక్కెళ్ళ రెడ్డి అడుగుతూంటే, అందరూ ఫక్కున నవ్వి, వాతావరణం కాస్త చల్లబడింది!
“మొదట ‘ఆగష్ట్ మొదటివారం లో అందరూ విత్తనాలు చల్లుకుంటారు—అది పూర్తయితేగానీ, బ్యాంకులు ఋణాలు ఇవ్వవు—అందుకని ఆగాం!’ అన్నాడు—యే బ్యాంకైనా రైతులు విత్తనాలు చల్లారా లేదా పరిశీలించి మాత్రమే పంట ఋణాలు ఇస్తోందా? అసలు సారవా కి జూన్ నెలలోనే ఋణాలు ఇవ్వడం మొదలెట్టేస్తారు కదా?” అన్నాడు మా బాలగంగాధర తిలక్.
“చూడండి! ‘మనం ఇప్పుడే ప్రకటిస్తే, బ్యాంకులు ఇంక ఋణాలు ఇవ్వవు—అందుకే—అందరూ ఋణాలు తీసుకునేవరకూ ఆగాలి’ అన్నాడు తరవాత! అంటే, అందరూ ఋణాలు తీసుకున్న తరవాత యే మాఫీయో ప్రకటిద్దాం, అప్పుడు పోయేవి బ్యాంకులూ, పడే వోట్లు మనకీ అనేనా?” అన్నాడు మా కేషియర్ వెంకట నాగభూషణం.
“తరవాత ‘రేపు జరగబోయే బ్యాంకర్ల సమావేశం లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు—అందుకని అదయ్యేవరకూ ఆగాల్సిందే’ అన్నాడు—బ్యాంకర్ల మీటింగుకీ, కరువుకీ యేమిటి సంబంధం అసలు?” క్రొశ్నించాడు మా బాలగంగాధర తిలక్.
“మూడో వారం వచ్చేటప్పటికి, ‘అసలు ప్రకటించనే ప్రకటించం—యెడం చెయ్యి పెట్టినా, పుర్రచెయ్యి పెట్టినా తేడా యేముంది? ప్రతిపక్ష రాజకీయం కాకపోతే? మీకేమి కావాలో చెప్పండి—విత్తనాలా? ఇస్తాము, నీళ్ళా? ఇస్తాము, యెరువులా? ఇస్తాము, గడ్డా? యేర్పాటు చేస్తాము, గొర్రెలా? ఇప్పిస్తాము, బర్రెలా? ఇప్పిస్తాము, ఇంకేమి కావాలి కరవుని యెదుర్కోడానికి? మరెందుకు ప్రకటన?’ అంటున్నాడు! మరి ఇప్పటికే ప్రకటించిన రాష్ట్రాలూ, సహాయం ప్రకటించిన కేంద్రం, పర్యటిస్తున్న కేంద్ర అంచనా బృందాలూ, ఇవన్నీ మిథ్యా? వాళ్ళందరూ వెర్రివాళ్ళా? యెవరి చెవుల్లో పువ్వులు పెడతాడు?” అంటూ మళ్ళీ రగిలిపోయాడు మా కామ్రేడ్ సుందరయ్య.
“అవన్నీ కాదు—తీరా ప్రకటించాక, రైల్వే బడ్జెట్, కేంద్ర బడ్జెట్ అనుభవాలు యెదురై, కేంద్రం మొండిచెయ్యి చూపిస్తే, వాళ్ళతో దెబ్బలాడే మొగాడు యెవడూ లేడుకదా—అందుకని భయం!” అన్నాడు మా వెంకట నాగభూషణం.
“పిచ్చివాళ్ళలారా! అసలు రహస్యం నేచెప్పనా? మన తెలుగువాడెవరైనా, పదిమందితోపాటు ‘జై’ అంటున్నా, ‘తొయ్’ అంటున్నా, ప్రతివాడికీ తనకే ప్రత్యేకమైన ఒక ‘స్వంత అజెండా’ వుంటుంది! అదే వాడికి భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం! అర్థమయ్యిందా?” అన్నారు చిద్విలాసం గా మా సర్వంబొచ్చు స్వామి!
ఇంకెవరైనా మాట్టాడితే వొట్టు!
నా అలవాటు ప్రకారం నా సిగరెట్టు నేను కాల్చుకుంటూ చిరునవ్వుతో వుండిపోయాను--చర్చ రగలేసిన నేను!

No comments: